మలయాళీ నటుడు దిలీప్కు కేరళలో ప్రత్యేక గుర్తింపు ఉంది. తనదైన హీరోయిజంతో పాటూ తెరపై హాస్యం పండించే ఆయన..ఆపదలో ఉన్నవారికి చేయూతనిచ్చేందుకు ఓ అడుగు ముందే ఉంటారు. అందుకే దిలీప్ అంటే కేరళైట్స్కు అభిమానం. ఆయన్ను దేవుని బోధకుడిగానూ మరికొందరు భావిస్తుంటారు.
ఈ మనసున్న మంచి నటుడు.. నిరుపేదలకు వెయ్యి ఇళ్లు కట్టివ్వాలని అనుకుంటున్నారు. రూ.55కోట్లు ఖర్చయ్యే ఈ ప్రాజెక్ట్లో కొన్ని స్వచ్ఛంద సంస్థలూ చేరాయి. దిలీప్ ప్రయత్నాన్ని ప్రశంసిస్తూ తమవంతు సాయం అందిస్తున్నాయి.
కొన్ని రోజుల క్రితం కేరళలో జిషా అనే యువతిని ఓ కామాంధుడు అత్యాచారం చేసి అత్యంత పాశవికంగా చంపేశాడు. ఈ ఘటన యావత్దేశాన్నీ నిశ్చేష్టులను చేసింది. ఈ దారుణంపై కదిలిపోయిన దిలీప్ జిషా ఉన్న ఇంటికి భద్రత లేదని తెలుసుకున్నారు. అందుకే.. నిరుపేదలకు సురక్షితమైన ఇళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభించారు. కటిక పేదలైన లబ్ధిదారులను గుర్తించేందుకు ఆయన అభిమానులు రంగంలోకి దిగారు. నిరుపేదలకు ఇళ్లు కట్టిస్తున్న దిలీప్ను ఇప్పుడంతా రియల్ హీరో అని పొగిడేస్తున్నారు.