తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గులాబీ గూటికి చేరనున్నారా ? పార్టీ మారేందుకు రెడీగా ఉన్న పొన్నం టీఆర్ఎస్ అధిష్టానానికి కొన్ని కండీషన్లు పెట్టారా ? పొన్నం పార్టీ మారేందుకు తన అనుచరులతో సీక్రెట్గా చర్చలు జరుపుతున్నారా ? పొన్నంను గూలాబి గూటికి చేర్చేందుకు మాజీ ఎంపీ వివేక్ చర్చలు జరుపుతున్నారా ? అంటే అవుననే సమాధానాలు కరీంనగర్ పాలిటిక్స్లో వినిపిస్తున్నాయి.
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో కీలకనేతగా ఉన్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హస్తానికి గుడ్ బై చెప్పేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. కేసీఆర్ ఎఫెక్ట్తో ఇప్పటికే తెలంగాణలోని పలువురు సీనియర్లు కాంగ్రెస్కు బై చెప్పి గులాబి గూటికి చేరిపోయారు. ఈ జాబితాలో పొన్నం ప్రభాకర్ పేరు కూడా వినిపించింది. అయితే ఆయన అప్పట్లో ఆ వార్తలను ఖండించి సైలెంట్ అయ్యారు. అయితే తాజాగా మరోసారి ఈ అంశం తెరమీదకు వచ్చింది.
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పొన్నం సోదరుడి కుమారుడు హుజూరాబాద్లో నెలకొల్పిన ఐటీ స్టార్టప్ కంపెనీని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో కలిసి పొన్నం పాల్గొన్నారు. దీంతో పొన్నం పార్టీ మార్పుపై గుసగుసలు జోరందుకున్నాయి. వాస్తవానికి ఎంపీ సుఖేందర్రెడ్డితో పాటే పొన్నం పార్టీ మారతారని అందరూ అనుకున్నారు. అయితే అయితే ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా ఉన్న బి.వినోద్కుమార్ అభిప్రాయం తీసుకున్నాకే పొన్నం చేరికకు కేసీఆర్ గ్రీన్సిగ్నల్ ఇవ్వాలని భావించడంతో పొన్నం టీఆర్ఎస్ ఎంట్రీ కాస్త లేట్ అయ్యింది.
ప్రస్తుతం పార్టీ మారేందుకు రెడీ అవుతున్న పొన్నం ఓ కండీషన్ పెడుతున్నట్టు సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని తనకు కేటాయించాలని ఆయన కోరుతున్నారట. వేములవాడ అసెంబ్లీ నియోజవర్గాన్ని ఆయనకు కేటాయిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. పొన్నంను ఎట్టి పరిస్థితుల్లోను టీఆర్ఎస్లోకి తీసుకువెళ్లాలని ఆయనకు అత్యంత సన్నిహితుడైన వివేక్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.