Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డాలర్ డ్రీమ్స్…డ్రీమ్ జాబ్…ఐటీ.. ఐటీ అనుబంధ రంగాల్లో ఉద్యోగం గురించి ఇవి పరిచయ వాక్యాలు. ఒకప్పుడు కలల కెరీర్ కు కేరాఫ్ అడ్రస్ అయిన ఈ రంగం ఇప్పుడు కుదుపులకు లోనవుతోంది. తీవ్రమైన ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఆటోమేషన్ – డిజిటల్ టెక్నాలజీల కారణంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు గల్లంతయ్యే ప్రమాదం వేగంగా ముందుకు సాగుతోంది. దీనికితోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త హెచ్1బీ వీసా సంస్కరణల నేపథ్యంలో టాప్ ఐటీ సేవల సంస్థలు భారత్ లో తమ ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. దీంతో భారతీయ ఐటీ పరిశ్రమ ఇప్పుడు బేల చూపులు చూస్తోంది.
డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదిస్తున్న హైర్ అమెరికన్ బై అమెరికన్ నినాదం ఊహించిన దానికంటే ఎక్కువగా సుమారు 150 బిలియన్ డాలర్ల వృద్ధి మందగమనంతో ఐటీ రంగం చిగురుటాకుల వణికిపోతోంది. టాప్ ఐటీ సేవల సంస్థలు భారత్ లో తమ ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి.దీంతో ఈ ప్రమాదం అటు ఉన్నతస్థానాల్లో ఇటు దిగువస్థాయిలో ఉన్న వారిని స్థాయికి సంబంధం లేకుండా కలవరపాటుకు గురి చేస్తోంది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు ఇందుకు నిదర్శనం. ప్రముఖ అంతర్జాతీయ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ ఇటీవల సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరువేల మంది ఉన్నత స్థాయి ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
మన దేశ ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ కూడా కీలకమైన ప్రకటన చేయనున్నట్లు సమాచారం. దాదాపు వెయ్యిమంది సీనియర్ ఉద్యోగులను రాజీనామా చేయమని కోరనుందని మార్కెట్ వర్గాల అంచనా. వీరిలో గ్రూపు ప్రాజెక్ట్ డైరెక్టర్ – ప్రాజెక్ట్ డైరెక్టర్లు – సీనియర్ ఆర్కిటెక్ట్ మరియు ఉన్నత స్థాయి ఉద్యోగులు ఉన్నారని ఈ స్థాయిల్లో డైరెక్టర్లు – మేనేజర్ల పనితీరు రిపోర్టును ఇన్ఫీ సమీక్షిస్తోందని వార్తలు వెలువడుతున్నాయి. మరి ఐటీకి పూర్వవైభవం ఎప్పుడు వస్తుందోనని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు.