హీరో కటౌట్ కు పాలాభిషేకాలు చేయడం చాలాకాలం నుంచే ఉంది. అభిమానుల్లో ఏదో సరదాగా మొదలైన ఆ అలవాటు ఇప్పుడు ట్రెడిషనైపోయింది. రజినీ ఫ్యాన్స్లో ఈ ట్రెండ్ విపరీతంగా ఉంటుంది. ఆయన సినిమా వచ్చిందంటే వారికి పండగే. ఇక తమ అభిమానాన్ని చాటుకునేందుకు ఆయన కటౌట్లు, పోస్టర్లపై పాలు కుమ్మరిస్తారు.
కబాలి శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుండడంతో.. రజనీ అభిమానుల్లో ఎక్కడలేని సందడి నెలకొంది. షరా మామూలుగానే వారు రజనీ కటౌట్ను పాలతో అభిషేకించడానికి రెడీ అయ్యారు. దీనికి కోసం రూ.20 లక్షల విలువ చేసే 50 వేల లీటర్ల పాలు వినియోగించనున్నట్లు తెలుస్తోంది. ఇదంతా తమిళనాడు పాల వ్యాపారుల సంఘం అంచనా.
అన్నామలై సినిమాలో రజినీ పాలవాడిగా నటించినప్పట్నుంచి అభిమానులు ఆయన కటౌట్ కు పాలాభిషేకాలు చేయడం ఉధృతం చేశారు. ఈ పద్ధతి మానుకోవాలని.. పాలను వృథా చేయొద్దన్న విజ్ఞప్తులు, డిమాండ్లు ఉన్నా.. రజనీ ఫ్యాన్స్ పట్టించుకోవడంలేదు.