Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రకాశం జిల్లా అద్దంకి టీడీపీ రాజకీయాల్లో సమన్వయం,సామరస్యం ఇక సాధ్యం కాదని తేలిపోయింది.పార్టీలోకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ వచ్చినప్పటినుంచి మొదలైన అంతర్గత విభేదాలు బలరాం కి ఎమ్మెల్సీ రావడంతో ఇంకాస్త పెరిగాయి.ఇప్పుడు ఇద్దరు బలరాం వర్గీయుల హత్యతో ఆ గొడవలు తారాస్థాయికి చేరాయి.ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడ్చాలన్న టీడీపీ హైకమాండ్ కి చుక్క ఎదురైంది. పార్టీలోకి గొట్టిపాటి రాకని వ్యతిరేకిస్తూ బలరాం ఆదినుంచి దూకుడుగానే వ్యవహరిస్తున్నారు.ఆ దూకుడుకు పగ్గాలు వేయడానికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే దాంతో బలం పుంజుకున్న ఆయన ఇంకా దూకుడుగా వుంటున్నారు.ఇప్పుడు బల్లికురవ మండలం,వేమవరం లో జరిగిన ఘర్షణలో తన వర్గానికి చెందిన ఇద్దరు చనిపోవడం,మరో ఐదుగురు గాయపడడంతో బలరాం స్వరం పెంచారు.వైసీపీ నుంచి తెచ్చి తమ నెత్తిన పెట్టిన నాయకుల పద్ధతికి సీఎం చంద్రబాబు సమాధానం ఇవ్వాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అటు సీఎం కూడా హత్యలకు కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దని జిల్లా పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు.ఈ ఘటనపై గొట్టిపాటి రవికుమార్ ఇంకా మాట్లాడలేదు.ఆయన స్పందించాక హైకమాండ్ ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.ఏదేమైనా అద్దంకిలో ఆపరేషన్ ఆకర్ష్ టీడీపీ కి చేదు అనుభవాన్ని మిగిల్చింది.ఇప్పటిదాకా గొట్టిపాటి మీదే విరుచుకుపడ్డ బలరాం లేటెస్ట్ గా చంద్రబాబు సమాధానం చెప్పాలని అనడం ద్వారా సీన్ వోల్టేజ్ పెంచారు.ఎవరి ఊహకు అంతుపట్టని ఈ పరిణామం చివరకు ఎటు దారి తీస్తుందో?