Posted [relativedate]
తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే తిరుమలేశునికి స్వర్ణాభరణాలు చేయిస్తానని కేసీఆర్ గతంలో మొక్కుకున్నారు. ఆ ఆకాంక్ష నెరవేరి రాష్ట్రం సిద్ధించింది. దీంతో అనుకున్నట్టుగానే తెలంగాణ ప్రభుత్వం .. టీటీడీ ఖాతాలో 5 కోట్ల రూపాయలు జమచేసింది. ఈ నిధులతో శ్రీవారికి కమలం నమూనాతో సాలిగ్రామ హారం, ఐదు పేటల కంఠె తయారు చేయించాలని దేవస్థానానికి సూచించింది. ఈ మేరకు టీటీడీ టెండర్లు ఆహ్వానించింది. కోయంబత్తూరుకు చెందిన కీర్తిలాల్ జ్యూయలర్స్ను ఎంపిక చేసి స్వర్ణాభరణాలు తయారుచేయించింది. 14.2 కిలోల సాలిగ్రామ హారానికి రూ.3,70,76,200….. 4.6 కిలోల కంఠెకు రూ.1,21,41,150 ఖర్చు అయ్యాయి.
శ్రీవారి బంగారు ఆభరణాలన్నీ సిద్ధమై 10 నెలలు గడిచిపోయింది. సీఎం కేసీఆర్ ఇప్పటివరకు మొక్కును చెల్లించలేకపోయారు. ఇప్పటికే ఆలస్యం జరిగిపోయింది కనుక వెంటనే మొక్కును చెల్లించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈమేరకు శ్రీనివాసుడికి ఆభరణాలను సమర్పించేందుకు తిరుమల వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మంత్రివర్గసభ్యులు, కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక రైలులో తిరుపతి యాత్రకు బయలుదేరాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.