Posted [relativedate]
పెద్ద నోట్ల రద్దుతో దేశమంతా ఆర్థిక ఎమర్జెన్సీని ఎదుర్కొంటోంది. జనంలో మోడీపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం అంతా బాగానే ఉందని చెబుతున్నా.. పైన పటారం లోన లొటారం అన్నట్టుగా ఉంది పరిస్థితి. జనం కరెన్సీ కోసం అష్టకష్టాలు పడుతున్నారు. దేశంలో పరిస్థితి ఇలా ఉంటే విదేశాల్లో మాత్రం మోడీపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
మన పక్కనే ఉన్న పాకిస్తాన్ అయితే మోడీపై ఎక్కడా లేని ప్రేమ కురిపిస్తోంది. పాక్ మీడియా పీఎం సారుపై ప్రశంసల వర్షం కురిపించింది. నోట్ల రద్దుపై గట్టి నిర్ణయం తీసుకున్నారంటూ ఆహా.. ఓహో అంటూ మోడీ నిర్ణయాన్ని స్వాగతించింది. ఇక పాకిస్థాన్లోని అనేక టీవీ ఛానళ్ళు దీనిపై చర్చా కార్యక్రమాలు నిర్వహించాయి. చర్చల్లో పాల్గొన్న ఆర్థిక నిపుణులు, మేధావులంతా మోడీజీ.. క్యా కమాల్ హై అంటూ చెప్పుకొచ్చారు. పనిలో పనిగా పాక్లో కూడా పెద్ద నోట్ల రద్దు చేపట్టాలని నవాజ్ షరీఫ్కు సర్కారుకు సలహా ఇచ్చారు. అటు పాక్ లోని ప్రతిపక్ష పార్టీలు ఇదే డిమాండ్ ను వినిపించారు. అయితే ఇండియాలోలా నోట్ల కష్టాలొస్తే.. అక్కడి జనం భారత్ లో లా సహనం చూపిస్తారా.. లేదా అన్నది వేరే మాట. మొత్తానికి నోట్ల రద్దుపై పాకిస్తాన్ లోనైతే పెద్ద చర్చే జరుగుతోంది.
ఇక ఆస్ట్రేలియా రెండాకులు ఎక్కువే చదివింది. మోడీ మార్గంలో నడిచేందుకు సిద్ధమవుతోంది. ఇండియాలోలాగే ఆసీస్ లోనూ పెద్ద నోట్లను రద్దు చేసేందుకు సిద్ధమవుతున్నారట. త్వరలోనే ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు ప్లాన్ జరుగుతోందట.
నోట్ల రద్దుతో అంతిమంగా ప్రజలకు మంచి జరగాలి. కానీ ఆ నిర్ణయం కొత్త కష్టాలు తెచ్చి పెట్టేదిగా ఉండకూడదు. ప్రస్తుతం భారత్ లో జరుగుతోంది అదే. సో విదేశాలైనా ఈ నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ప్రజలు కష్టపడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే మంచిదని ఆర్థిక వేత్తలు సలహా ఇస్తున్నారు.