Posted [relativedate]
ఏ సినిమాకైనా సెన్సార్ బోర్డు ఇచ్చే సర్టిఫికేటే మూలం. వాళ్లు సర్టిఫికేట్ ఇవ్వకుంటే సినిమా విడుదల జరగదు. అటువంటి సెన్సార్ బోర్డు ఓ సినిమాకు సర్టిఫికేట్ జారీ చేసేందుకు మాత్రం నో చెప్పింది. అది మోదీ సినిమా అయినా సర్టిఫికేట్ ఇవ్వలేమని సెన్సార్ బోర్డు సభ్యులు తేల్చి చెప్పేశారు. దీంతో ఆ చిత్ర నిర్మాత సెన్సార్ బోర్డుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్రమోదీ జీవితంలోని కీలక అంశాల ఆధారంగా ‘మోదీ కా గావ్’ సినిమా తెరకెక్కుతోందన్న విషయం తెలిసిందే. తుషార్ ఏ గోయల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేష్ ఝా నిర్మించారు. కాగా ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున ఈ చిత్రాన్ని విడుదల చేయలేమని, సర్టిఫికేట్ ని ఇవ్వలేమని సెన్సార్ బోర్డు తేల్చి చెప్పింది. అలాగే చిత్రంలో పప్పు బీహారీ అనే పదాన్ని, ఓ పాటను తొలగించాలని సెన్సార్ బోర్డు సూచించింది.
అయితే తన సినిమా విడుదల కాకుండా కావాలనే సెన్సార్ బోర్డు మెలిక పెట్టిందని, అవసరమైతే కోర్టుకు వెళతానని చిత్ర నిర్మాత ఝా ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ నుండి NOC తెచ్చుకోమని బోర్డు చెబుతోందని, తాను NOC తెచ్చుకుంటే సెన్సార్ బోర్డు ఎందుకని నిర్మాత ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయంపై అటు సెన్సార్ బోర్డు, ఇటు చిత్ర యూనిట్ ఏం చేయనుందో చూడాలి.